భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు ఊరట

  • బ్రిజ్ భూషణ్‌పై నమోదైన పోక్సో కేసును కొట్టివేసిన ఢిల్లీ కోర్టు
  • పోలీసుల నివేదికపై ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయని మైనర్ ఫిర్యాదుదారు, ఆమె తండ్రి
  • ఆరుగురు రెజ్లర్లు ఫిర్యాదుకు సంబంధించి కోర్టులో చార్జిషీటు దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన పోక్సో కేసును ఢిల్లీ కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ కేసును రద్దు చేస్తూ 2023 జూన్ 15న ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన నివేదికను కోర్టు ఆమోదించింది.

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడని పలువురు మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారిలో ఒక మైనర్ బాలిక ఉండటంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన ఢిల్లీ పోలీసులు ఆరుగురు రెజ్లర్లు దాఖలు చేసిన ఫిర్యాదుపై ఛార్జిషీటు దాఖలు చేస్తూ, మైనర్ ప్రమేయం ఉన్న కేసును రద్దు చేయాలని కోర్టుకు నివేదిక సమర్పించారు.

పోక్సో కేసులో మైనర్ ఫిర్యాదుదారు, ఆమె తండ్రి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేసు రద్దు చేయాలని ఢిల్లీ పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. అనంతరం మైనర్ ఫిర్యాదుదారు, ఆమె తండ్రికి కోర్టు నోటీసులు జారీ చేసి పోలీసుల నివేదికపై స్పందన కోరింది. 2023 ఆగస్టులో వారు కోర్టుకు హాజరై పోలీసుల నివేదికపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో సోమవారం ఢిల్లీ కోర్టు బ్రిజ్ భూషణ్‌పై నమోదైన పోక్సో కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా, కోర్టు తీర్పుపై బ్రిజ్ భూషణ్ కుమారుడు ప్రతీక్ భూషణ్ సింగ్ స్పందించారు. తన తండ్రిపై మిగిలిన లైంగిక వేధింపుల కేసులు కూడా అబద్ధమని తేలుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Brij Bhushan Sharan Singh
Brij Bhushan
Wrestling Federation of India
Delhi Court
POCSO Act
sexual harassment case
Prateek Bhushan Singh
Indian wrestling
minor wrestler
BJP leader

More Telugu News